Monday, May 19, 2008

ఎవరికైనా ఈ పద్యం గుర్తుంటే కాస్త సరిచేయండి.

ఎప్పుడో చిన్నప్పుడు తెలుగు పుస్తకములో చదివిన గుర్తు. నా బుర్రలో అప్పటినంచీ ఈ వాక్యం తిరుగుతోంది. పరభాషా ప్రియత్వంతో మతృభాషని చులకనగా చూసేవాళ్ళమీద వ్యాఖ్యానిస్తూ తెలుగు గురించి వీరేశలింగం పంతులుగారు అనుకుంటా, ఇలా అన్నారు.
మన భాషయే, మకరంద బిందు బృందస్యందన సుందరమగు మాతృభాషయే, మహానందకందోళ సందోహ సంధానతుందిలమగు మాతృభాషయే, నమ్రతకు నమ్రత, కఠినతకు కఠినత, వదలునకు వదలు బిగికి బిగి, జోరునకు జోరు, అన్ని వన్నెలు, అన్ని చిన్నెలు, అన్ని హొయలు, అన్ని వయ్యారములు కలిగిన భాషయే....
ఇంకా చాలా ఉండాలి. మర్చిపొయా.. ఎవరికైనా సరిగ్గా గుర్తుంటే కాస్త సరిచేయండి.

-------------------

ఈ రొజు ఇంకాస్త గట్టిగా వెదికితే ఇక్కడ (http://ourtextbooks.blogspot.com/2006/02/textbook_114082693613147526.html)

ఈ వచనం ఇంకాస్త దొరికింది. అది అన్నది పానుగంటి లక్ష్మీనరసిం హారావుగారంట.

Wednesday, April 9, 2008

ఉగాది శుభాకాంక్షలు.

సర్వధారి నామ సంవత్సరం మీ అందరికీ సంతోషాన్నీ, ఆరోగ్యాన్నీ, సంపదల్నీ ఇవ్వాలని కోరుకుంటున్నాను.

ఈ పండగ 3 రోజులు సెలవల్లో బాగా తిరిగాను. ఈ ఉగాది మా పిన్ని వాళ్ళ ఇంట్లో చాలా ఆనందంగా గడిచింది. ఈ కర్ణాటక తమిళనాడుల మధ్య గొడవల పుణ్యమా అని వెల్లూరులో లక్ష్మీనారాయణి గుడి అంతా ఖాళీగా ఉంది. మామూలుగా 4 గంటలు పట్టేదిట దర్శనానికి. ఈసారి ఎవ్వరూ లేరు. మేమే ఓ గంట కూర్చుని వచ్చాము.
1.5 టన్నుల బంగారంతో దాదాపు 550 కోట్లతో కట్టిన గుడి అది. అద్భుతంగా ఉంది. కానీ భక్తి భావం కలిగించె విధంగా లేదు అనిపించింది. అక్కడ ఫొటోలు తీయనివ్వరు కానీ ఇది ఎక్కడో అంతర్జాలం లో దొరికింది. (ఫొటోలు అవే మారతాయి)



తిరుపతిలో దర్శనం కూడా చాలా తేలికగా ఐంది.
ఉగాది అలంకారం చాలా బావుంది. పళ్ళు పూలు కలిపి దండలు కట్టారు. మొత్తం గుడి అంతా పూలతో నింపేసారు.
అంతా బానే ఉందికానీ మహాద్వారం వద్ద ఆ కొత్త చానల్ (SVBC) వాళ్ళు అనుకుంటా, శుభాకాంక్షలు బోర్డ్ పెట్టారు. వాళ్ళ తెలుగు మాత్రం ఏడిసినట్టుంది. ఉగాది అని రాయటం రాలేదు. "ఊ" రాసి ఆ దీర్ఘం చరిపేసారు. మీరే చూడండి.


ఈ కొత్త సంవత్సరంలొ ఆ శ్రీనివాసుడు జనాలకి మాతృభాష మీద అభిమానం, తెలుగు భాషా పరిజ్ఞానం కలిగిస్తాడని కోరుకుంటున్నాను.

Monday, February 11, 2008

వాహ్.. ఉస్తాద్, వాహ్.



ఈ శెనివారం బెంగళూరులో జరిగిన "A Tribute to Bangalore" కచేరీకి వెళ్ళాను. (ఆ పేరు ఎందుకు పెట్టారో అర్ధం కాలేదు).
ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ తబలా, పండిట్ శివకుమార్ శర్మ సంతూర్ మొదటి సారి జుగల్బందీ.

ముందు శివకుమార్ గారు ఝింఝోటి రాగంలో ( jhinjhoti తెలుగు లో ఎలా రాయాలో తెలీదు. :-/) ఆలాపనతో మొదలెట్టారు. జాకిర్ హుస్సేన్ మధ్యలో కలిసాక ఇక కాస్త ఊపు అందుకుంది. ఈ కచేరీ వినటం కన్న చూడటానికి చాలా బావుంటుంది. జాకిర్ హుస్సేన్ చేతి వేళ్ళు తబలా మీద ఎంత వేగంగా కదుల్తున్నాయంటే చూడటానికి ఓ high speed camera కావాలేమో అనిపిస్తుంది. శివకుమార్ శర్మ గారు ఏమీ తక్కువ తినలేదు. నేను ఎప్పుడూ సంతూర్ వినటమే గానీ వాయించటం చూడ్లేదు. 100 తంత్రులు ఉన్న ఆ వాయిద్యంలో ఒకొక్క తీగనూ అంత జాగ్రత్తగా, వేగంగా మీటి సుమధుర రాగలను పలికింపచెయటం నిజంగా అధ్భుతం.

కానీ ఆ హాల్లొ స్పీకర్లు అంత బాలేదు. పాపం జాకిర్ హుస్సేను గారు " reverbration ఎక్కువగా ఉంది. మేము వాయించేది మాకే వినపడట్లేదు" అని మొత్తుకున్నా ఎవ్వరూ వినలేదు. అది సరిచేసే సరికి సగం కచేరీ ఐపొయింది.
పదింటికల్లా చాలామంది ఓపిక లేని జనాలు వెళ్ళిపొవటంతో కాస్త మధ్య వరసలో అంబికా వాళ్ళ పక్కన సీటు దొరికింది. అప్పుడు వాళ్ళు వాయించిన పహాడీ రాగమాలికను ఓ గంట సరిగ్గా ఆనందించగలిగాం. వెళ్ళిపొయిన వాళ్ళ మీద జాలిపడ్డాం.
ఇంటికి వెళ్ళేసరికి 12. వానలో తడిసి ముద్దయ్యాను. కానీ ఈ కచేరీ మధురాలాపనలు ఎప్పటికీ మరిచిపొలేను. ఎప్పుడైనా CD దొరికితే వినండి.